చిత్రం : ప్రతిఘటన (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : జానకి
పల్లవి :
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో... మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం..
చరణం 1 :
పుడుతూనే పాలకేడ్చి... పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో... మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడీ మీకోసం
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో... మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం
చరణం 2 :
కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుచేసి
పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర
ప్రతి భారతి సతి మానం చంద్రమతీ మాంగల్యం
మర్మస్థానం కాదది... మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ ఆయిన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుందీ సభ్యసమాజం
ఏమైపోతుందీ మానవధర్మం
ఏమైపోతుందీ ఈ భారతదేశం
మన భారతదేశం... మన భారతదేశం... మన భారతదేశం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5113
No comments:
Post a Comment